కరోనా లక్షణాలతో వెళ్తే.. మందులు రాసి పంపారు!

ఇండోర్‌: ప్రాణాంతక వైరస్‌ కట్టడిలో మధ్యప్రదేశ్‌ వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి నామమాత్రపు చికిత్స అందించడంతోపాటు.. అవసరానికి అంబులెన్స్‌ ఇవ్వలేకపోయారు. దాంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచారు. వివరాలు.. కోవిడ్‌ కంటైన్‌మెంట్లలో ఒకటైన బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే (60) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు మహారహ యశ్వంత్‌రావ్‌ (ఎంవై) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మందులు రాసి ఇంటికి పంపించారు. 



మంగళవారం పాండు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ని మరోసారి ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. అయితే, అంబులెన్స్‌ పంపడానికి ఎంవై ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దాంతో గతిలేని పరిస్థితుల్లో బైక్‌పైనే పేషంట్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అంబులెన్స్‌ పంపించి ఉంటే పాండు బతికేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. ఇండోర్‌ నగర మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తొలుత పాండుని ఓ వ్రైవేటు ఆస్పత్రికి తరలించారని.. అక్కడి నుంచి బైక్‌పై ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లగా దురదృష్టవశాత్తూ ఆయన మరణించాడని పేర్కొన్నారు. కాగా, మృతుని కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తామని ఎంవై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పీఎస్ ఠాకూర్‌ చెప్పారు.